రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌...తల్లిదండ్రులకు షాకింగ్‌ న్యూస్‌..! | Paper Industry Crisis May Lead to Notebooks Turning Pricey Shortage of Textbooks | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు షాకింగ్‌ న్యూస్‌ ..! భారీగా పెరగనున్న నోట్‌బుక్స్‌ ధరలు...! ఎంతంటే..?

Mar 27 2022 5:35 PM | Updated on Mar 27 2022 5:49 PM

Paper Industry Crisis May Lead to Notebooks Turning Pricey Shortage of Textbooks - Sakshi

కోవిడ్‌-19 దెబ్బకు విద్యార్థులు పూర్తిగా ఆన్‌లైన్‌ చదువులకే పరిమితమైన విషయం తెలిసిందే.  ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి తగ్గడంతో స్కూళ్లు ఒపెన్‌ అయ్యాయి. నెలరోజులుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఇంటి బడ్జెట్‌ భారీగా పెరిగింది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని  తాకాయి. కాగా ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌  వార్‌ ఎఫెక్ట్‌ విద్యార్థుల చదువుపై పడనున్నట్లు సమాచారం.  విద్యార్థుల చదువులు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. 

భారీగా పెరగనున్న పుస్తకాల ధరలు..!
రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో క్రూడాయిల్‌, కోల్‌ ధరలు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదల ఒక్కింతా పేపర్‌ పరిశ్రమలకు కూడా శాపంగా మారింది. దీంతో విద్యార్థుల పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల ధరలు పెరగటంతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) వేస్ట్‌ కటింగ్స్‌ ఎగుమతులపై నిషేధం విధించటంతో నోట్‌బుక్స్‌ ధరల పెరిగే అవకాశం ఉందని పేపర్‌ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. పేపర్‌ కొరత కారణంగా రానున్న రోజుల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ తగ్గిపోయి వచ్చే విద్యా సంవత్సరంలో వాటికి కొరత ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. 

మే నుంచి ధరల బాదుడు..!
పేపర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ఇప్పటికే తమ డీలర్లకు నోట్‌ పుస్తకాల ధరలను పెంచుతున్నట్లు సంకేతాలిచ్చాయి. పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ ధరలు మే నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే పెంచిన ధరలతో నోట్‌బుక్స్‌ను సరఫరా చేస్తామని డీలర్లకు సదరు కంపెనీలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.కోవిడ్‌ కంటే ముందు కేజీ పేపర్‌ ధర రూ.55 ఉండగా ప్రస్తుతం రూ.100కి చేరింది. పేపర్‌ తయారీలో ఉపయోగించే అన్ని రకాలైన ముడి పదార్ధాల ధరలు పెరగటంతో తాము ధరలు పెంచక తప్పటం లేదని అఖిల భారత పేపర్‌ ట్రేడర్స్‌ సమాఖ్య ప్రెసిడెంట్‌ దీపక్‌ మిట్టల్‌ తెలిపారు. 

నిషేధం విధించిన ఈయూ..!
పేపర్‌ వేస్ట్‌ కటింగ్స్‌పై ఈయూ దేశాలు నిషేధం విధించటంతో పేపర్‌ పరిశ్రమపై భారీ ప్రభావం చూపనుంది. కాగా  నిషేధంపై చర్చించేందుకు ఈయూ దేశాలు ఏప్రిల్‌ 14న భేటీ కానుండగా...దీనిపై సానుకూల నిర్ణయం తీసుకున్నా ధరలు దిగిరావటానికి చాలా సమయం పట్టే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

తగ్గిపోయిన పాత పేపర్లు..! ప్యాకేజింగ్‌పై ఎఫెక్ట్‌..!
కోవిడ్‌ కారణంగా వార్తాపత్రికలు, జర్నల్స్‌కు ప్రజలు దూరంగా ఉండిపోయారు. దీంతో పాత పేపర్ల రీసర్క్యులేషన్‌ 35 శాతం మేర తగ్గిపోయింది. ఇప్పుడిదే దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ, ఈ కామర్స్‌ సంస్థలకు ప్యాకేజింగ్‌ విషయంలో భారీ నష్టం జరగనుంది. కార్డ్‌బోర్డ్‌ తయారీలో పాత పేపర్లే కీలకం. కార్డ్‌ బోర్డ్‌ ప్యాకేజింగ్‌ విషయంలో ఈ సంస్థలను తీవ్రంగా వేధించనున్నాయి. 

చదవండి: ఎలన్‌మస్క్‌ సంచలన నిర్ణయం..! సోషల్‌ మీడియాపై గురి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement