
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
శాన్ఫ్రాన్సిస్కో: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో చర్చలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెప్టెంబర్–అక్టోబర్ నాటికి తొలి దశకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. భారత్ సహా పలు దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాలు బీటీఏపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన చర్చలను రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు, సెమీకండక్టర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేథ మొదలైన వాటిల్లో పురోగమిస్తున్న భారత్.. భవిష్యత్తులో ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆమె చెప్పారు.