శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌! | New Fame for Shamshabad Realty Buzz Returns | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

Feb 7 2026 8:56 AM | Updated on Feb 7 2026 10:34 AM

New Fame for Shamshabad Realty Buzz Returns

ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా శంషాబాద్‌ అభివృద్ధి

చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్‌ బూమ్‌కు చాన్స్‌

భూములు, విల్లాలు, గృహాలకు డిమాండ్‌

భూముల కొనుగోళ్లకు ఎంక్వైరీ షురూ..

భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్‌.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్‌ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నగరంగా శంషాబాద్‌ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్‌ టరి్మనల్‌ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్‌ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరో

ఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్‌ హబ్‌గా అభివృద్ధి చెందిన శంషాబాద్‌.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్‌ నెట్‌వర్క్‌ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా శంషాబాద్‌ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.

కానీ, శంషాబాద్‌ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్‌కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్‌ రింగ్‌ రోడ్‌(త్రిబుల్‌ ఆర్‌)తో కూడా అనుసంధానమవుతుంది.

ఐటీ హబ్‌లతో అనుసంధానం.. 
దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లలో రాజీవ్‌గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్‌ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.

విమానాశ్రయ కారిడార్‌ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌ నగరాలను ఈ హైస్పీడ్‌ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.

ఈ ప్రాంతాలకు డిమాండ్‌.. 
2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్‌ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్‌ హబ్‌లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్‌ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్‌ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.

సమగ్ర అభివృద్ధి దిశగా..
ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.

ప్రస్తుతం శంషాబాద్‌లో అపార్ట్‌మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీ–సూట్‌ ట్రాన్సిట్‌ ఆఫీస్‌గా..
స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్‌ హబ్‌తో శంషాబాద్‌ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్‌ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్‌లకు, కార్పొరేట్లకు సీ–సూట్‌కు ట్రాన్సిట్‌ ఆఫీస్‌గా మారుతుంది. ఫైవ్‌స్టార్‌ హాస్పిటాలిటీ, కన్వెన్షన్‌ సెంటర్లకు డిమాండ్‌ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్‌ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement