రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి నంబరు ఖరారు
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
సంగారెడ్డి–చౌటుప్పల్ మధ్య ఉన్న ప్రస్తుత రోడ్డుకు జాతీయ రహదారి హోదా తొలగింపు
దానికి ఉన్న ఈ నంబరును రింగురోడ్డుకు కేటాయింపు
టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించడమే తరువాయి
ఆగస్టు నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనులు ప్రారంభించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ రోడ్డుకు జాతీయ రహదారి నంబరును కేటాయించింది. 161ఏఏ నంబరును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే టెండర్లు పిలిచినప్పటికీ, ఆ తర్వాత రోడ్డును నాలుగు వరుసలకే కుదించడంతోపాటు కొన్ని మార్పులు చేయటంతో అందులో జాప్యం జరిగింది. టెండర్ల ఫైనాన్షియల్ బిడ్ను తెరవాలంటే రోడ్డుకు జాతీయ నంబరు వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ అవాంతరం కూడా తొలగింది. దీంతో ఇక టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించటమే తరువాయి.
ఆ రోడ్డు నంబరు దీనికి...
ప్రస్తుతం సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న జాతీయ రహదారికి 161ఏఏ నంబరు ఉంది. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం కూడా దానికి సమాంతరంగా సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించనున్న విషయం తెలిసిందే. రీ జినల్ రింగురోడ్డు జాతీయ రహదారిగా రూపొందనున్నందున, అదే మార్గంలో మరో జాతీయ రహదారి అవసరం లేదు. దీంతో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ప్ర స్తుత రోడ్డుకు జాతీయ రహదారి హోదా తొలగించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోకి తిప్పి పంపనున్నారు.
దీంతో దానికి ఉన్న 161 ఏఏ జాతీయ రహదారి నంబరును రీజి నల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి కేటాయించారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ప్రస్తుత జాతీయ రహ దారి ఇక రాష్ట్ర రహదారిగా మారుతుంది. రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు సంగారెడ్డి–, చౌ టుప్పల్ రోడ్డును అందులో భాగంగా అభివృద్ధి చేయాలని భావించారు. పూర్తి కొత్త రోడ్డు(గ్రీన్ఫీల్డ్)గా కాకుండా బ్రౌన్ఫీల్డ్ రోడ్డుగానే దాన్ని నిర్మించాలన్నది తొలి ఆలో చన. తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్వే స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. అప్పుడు అది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది.
పట్టణాల మీదుగా కొన సాగుతున్న ప్రస్తుత రోడ్డు అందుకు సరిపోదు. దీంతో దాన్ని రీజినల్ రింగురోడ్డుగా మార్చాలన్న ఆలోచనను విరమించుకున్నారు. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం వద్ద ఎన్హెచ్–65 నుంచి ఉత్తర రింగు మొదలై, అదే ఎన్హెచ్–65 మీదే ఉన్న చౌటుప్పల్ సమీపంలోని తంగేడుపల్లి వరకు కొనసాగుతుంది. మహారాష్ట్రలోని అకో లా నుంచి సంగారెడ్డి వరకు ఉన్న జాతీయ రహదారికి 181 నంబరు ఉంది. అక్కడి నుంచే రీజినల్ రింగురోడ్డు మొదలు కానున్నందున అదే నంబరును కొన సాగిస్తున్నారు.
సాధారణంగా ఇలాంటి అనుసంధాన రోడ్డు నంబరుకు ఏ అన్న ఆంగ్ల అక్షరాన్ని జోడిస్తారు. కానీ, ఇప్పటికే మహారాష్ట్రలోని అకోట్ నుంచి బీదర్ వరకు ఉన్న జాతీయ రహదారికి 161ఏ కొనసాగుతోంది. దీంతో కొత్త రోడ్డుకు 161ఏఏ ఖరారు చేశారు. కేంద్ర రహదారుల శాఖ అధీనంలోని జాతీయరోడ్ల వరసలో ఈ కొత్త రోడ్డు 402వదిగా గెజిట్లో చూపారు.
ఈ నెలలోనే పీపీపీఏసీ భేటీ... రోడ్డు నిర్మాణానికి ఆమోదం...
ఇప్పటికే కేంద్ర జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి స్థాయిలో రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి ఆమో దం లభించింది. దీనికి నిధులు విడుదల కావాలంటే, కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ)ఆమోదం అసవరం. ఈ నెలాఖరుకు ఆ సమావేశం ఉంటుందని సమాచారం. రోడ్డు నంబరు కూడా కేటాయించినందున ఇక టెండర్లు తెరిచేందుకు పీపీపీఏసీ ఆమో దముద్ర వేయనుంది. దీంతో నిర్మాణ సంస్థతో ఒప్పందానికి మార్గం సుగమమవుతుంది. ఆగస్టు నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే వీలుంది.


