రూ.3000 కోట్లకు జర్మన్ కంపెనీ పెట్టుబడులు? | Mercedes Benz Invest Rs 3000 Crore in India | Sakshi
Sakshi News home page

రూ.3000 కోట్లకు జర్మన్ కంపెనీ పెట్టుబడులు?

Jan 9 2024 7:55 AM | Updated on Jan 11 2024 12:13 PM

Mercedes Benz Invest Rs 3000 Crore in India - Sakshi

న్యూఢిల్లీ: నూతన ఉత్పత్తులు, తయారీ కార్యకలాపాలు, డిజిటలీకరణకు ఈ ఏడాది రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు మెర్సిడెస్‌ బెంజ్‌ వెల్లడించింది. దీంతో సంస్థ భారత్‌లో పెట్టుబడి రూ.3,000 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2023లో కంపెనీ భారత్‌లో రికార్డు స్థాయిలో 10 శాతం వృద్ధితో 17,408 యూనిట్లను విక్రయించింది. 2024లో మూడు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌తో కలిపి 12 కొత్త మోడళ్లు, వేరియంట్లను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రూ.1.5 కోట్లకుపైగా ఖరీదు చేసే టాప్‌ ఎండ్‌ మోడళ్లు సగం ఉంటాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. 

‘2024లో రెండంకెల వృద్ధి సాధిస్తాం. ఆర్డర్‌ బుక్‌ 3,000 యూనిట్లు ఉంది. అమ్మకాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతం. ఈవీల వాటా నాలుగేళ్లలో 20–25 శాతానికి చేరుకుంటుంది. ఎస్‌యూవీల వాటా 55 శాతం ఉంది. 10 నగరాల్లో కొత్తగా 20 వర్క్‌షాప్స్‌ ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు. 

భారత్‌లో అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్లాంట్‌ను నెలకొల్పడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కోరుతున్నట్లు వచ్చిన నివేదికలపై అయ్యర్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం ఏదైనా పాలసీని ప్రకటిస్తే అది భారత్‌లో పెట్టుబడి పెట్టిన ప్రస్తుత తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని మాకు చాలా నమ్మకం ఉంది. ఈవీ విభాగంలోకి కొత్త కంపెనీని స్వాగతిస్తున్నాం. మార్కెట్‌లో ఈవీల స్వీకరణను ఇది మరింత తీవ్రతరం చేస్తుంది’ అని అన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్‌ వర్షన్స్‌లో రూ.1.32 కోట్ల ప్రారంభ ధరతో జీఎల్‌ఎస్‌ లగ్జరీ ఎస్‌యూవీని మెర్సిడెస్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement