‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు! | Maha Kumbh set to generate Rs 3 lakh crore business CAIT | Sakshi
Sakshi News home page

‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!

Feb 21 2025 8:24 PM | Updated on Feb 21 2025 8:27 PM

Maha Kumbh set to generate Rs 3 lakh crore business CAIT

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సంగమ తీరానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా ఈ మహా కుంభమేళా  వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్‌ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT ) తాజాగా అంచనా వేసింది.

ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నారు.​​​​​ జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక సంరంభానికి 40 కోట్ల మంది తరలివస్తారని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని ప్రారంభంలో అంచనా వేశాయి. అయితే 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అపూర్వమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహం కారణంగా ఇందులో పాల్గొన్నవారి సంఖ్య ఇప్పటికే 60 కోట్లు దాటి ఉంటుందని, రూ. 3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్ జరుగుతుందని తాజాగా అంచనాలను సవరించారు.

సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కూడలి అని, విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని దృఢంగా స్థాపించిందని అభివర్ణించారు. మహా కుంభ్ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. మహా కుంభ్ థీమ్‌తో తీర్చిదిద్దిన డైరీలు, క్యాలెండర్లు , జనపనార సంచులు, స్టేషనరీ వంటి  ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం కారణంగా అమ్మకాలు పెరిగాయి.​

150 కి.మీ విస్తరించిన వ్యాపారం
మహా కుంభమేళా ఆర్థిక ప్రభావం ప్రయాగ్‌రాజ్‌కే పరిమితం కాలేదు.​​​ ఇక్కడికి 150 కి.మీ పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. మరోవైపు అయోధ్య, వారణాసి వంటి తీర్థ స్థలాలకు యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఈ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్లు , రోడ్లు అండర్‌పాస్‌లతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 7500 కోట్లు ఖర్చు చేసింది. ఈ పెట్టుబడి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నారు.​

Advertisement
 
Advertisement
Advertisement