
ముంబై: రుణాలు డిఫాల్ట్ అయిన కస్టమర్లపై బ్యాంకులు అదనపు వడ్డీ, చార్జీలు విధించి దాన్ని అసలుకు కలిపే విధానానికి చెక్ పెట్టేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనలు చేసింది.
జరిమానాగా వడ్డించే చార్జీల పరిమాణం అనేది డిఫాల్ట్ అయిన మొత్తానికి అనుగుణంగా మాత్రమే ఉండాలని సహేతుక రుణ విధానాలపై విడుదల చేసిన ఒక సర్క్యులర్ ముసాయిదాలో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని రుణగ్రహీత సక్రమంగా తిరిగి చెల్లించేలా చూడటమే జరిమానాల ప్రధాన ఉద్దేశ్యమని, వాటిని ఆదాయ వనరుగా బ్యాంకులు భావించరాదని సూచించింది.