
ఈ వారం 4 కంపెనీలు రెడీ
బొరానా వీవ్స్, బెల్రైజ్ లిస్టింగ్
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి నెలకొంది. ఈ బాటలో మరో నాలుగు కంపెనీలు స్టాక్ మార్కెట్ల తలుపు తట్టనున్నాయి. ఈ వారం ఇష్యూలు ప్రారంభంకానున్న కంపెనీల జాబితాలో లీలా ప్యాలసెస్ హోటల్స్ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ చేరాయి. ఇతర చిన్న సంస్థలలో ప్రోస్టార్ ఇన్ఫో సిస్టమ్స్, స్కోడా ట్యూబ్స్ ఐపీవోకు రానున్నాయి. మరోపక్క గత వారం ఇష్యూలను పూర్తి చేసుకున్న బొరానా వీవ్స్(28న), బెల్రైజ్ ఇండస్ట్రీస్(29న) లిస్ట్కానున్నాయి.
లీలా ప్యాలసెస్
ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు షేరుకి రూ. 413–435 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 3,500 కోట్ల సమీకరణపై కన్నేసింది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఏజిస్ వొప్యాక్
లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ రూ. 223–235 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
స్కోడా ట్యూబ్స్
స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబులు, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ రూ. 130–140 ధరల శ్రేణిలో ఈ నెల 28–30 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 220 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్
సమీకృత పవర్ సొల్యూషన్ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇందుకు షేరుకి రూ. 95–105 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమూ 29న ముగియనుంది. తద్వారా రూ.168 కోట్లు సమకూర్చుకోనుంది.