అమెరికా సైనిక, ఆర్థిక, సాంకేతిక మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా బహ్రెయిన్లో ఉన్న ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్కు చెందిన ప్రధాన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.
ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా ప్రతికార దాడి
ఇరాన్ అధికారిక వార్తా సంస్థల (ఐఆర్ఎన్ఏ, తస్నీమ్) వివరాల ప్రకారం.. తమ ఏరోస్పేస్ బలగాలు ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా దాడులను నిర్వహించాయి. ఇటీవల ఇరాన్లోని దార్ఖోవిన్ వద్ద అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న పౌర అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడులకు నిరసనగా ఈ క్షిపణి దాడి చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) హార్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రత నెపంతో ఇరాన్ స్థావరాలపై దాడులకు దిగుతుండటంతో ఇరాన్ సైతం గల్ఫ్ రీజియన్లోని అమెరికా రాడార్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ డిజిటల్ వనరులను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది.
స్వతంత్ర వర్గాల స్పందన.. ప్రస్తుత పరిస్థితి
ఐఆర్జీసీ చేసిన ఈ క్షిపణి దాడి ప్రకటనపై అమెజాన్ సంస్థ గానీ, బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ విడుదల చేయలేదు. దాడి వల్ల జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం వివరాలపై స్వతంత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
గ్లోబల్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలపై ప్రభావం
యుద్ధాల్లో కేవలం మిలిటరీ క్యాంపులనే కాకుండా ప్రధాన టెక్ కంపెనీల డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. బహ్రెయిన్ వంటి కీలక ఆర్థిక కేంద్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక వసతులపై దాడి జరగడం వల్ల ప్రాంతీయ డిజిటల్ సేవలు, గ్లోబల్ సప్లై చైన్, అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్క్లు దెబ్బతినే ప్రమాదముంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..


