మార్కెట్‌కు హార్మూజ్‌ టెన్షన్‌! | Iran control over Strait of Hormuz sparks concern | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు హార్మూజ్‌ టెన్షన్‌!

Apr 20 2026 5:12 AM | Updated on Apr 20 2026 5:12 AM

Iran control over Strait of Hormuz sparks concern

యూఎస్, ఇరాన్‌ మధ్య మళ్లీ వివాదం 

చమురు ధరలు ఎగబాకే ప్రమాదం...

జనవరి–మార్చి ఫలితాలకు ప్రాధాన్యం 

స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్‌పై తాజా అంచనాలు

పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్‌ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్‌ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్‌ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్‌ జలాలపై యూఎస్, ఇరాన్‌ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. 

వెరసి దేశీ స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్‌ రిస్క్‌ సెంటిమెంట్‌కు కీలకమైన ఇరాన్, యూఎస్‌ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్ముడి ఆర్‌. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది.  

రిజల్ట్స్‌ సీజన్‌.. 
గత వారాంతాన బ్యాంకింగ్‌ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐతోపాటు యస్‌ బ్యాంక్‌ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్‌పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్‌ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, శ్రీరామ్‌ ఫైనాన్స్, పీఎన్‌బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్‌బీఐ లైఫ్, ఎల్‌టీ టెక్, ఎల్‌టీఎం, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ తదితరాలున్నాయి. 

గణాంకాలు కీలకం 
మార్చి నెలకు నేడు(20న) ఇన్‌ఫ్రా ఔట్‌పుట్‌ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్‌ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా పేర్కొన్నారు.

గత వారమిలా 
వరుసగా రెండో వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి.     
     
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement