ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి? | Interesting Details About Google CEO Sundar Pichai Wife Anjali Pichai | Sakshi
Sakshi News home page

ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?

Apr 4 2025 3:33 PM | Updated on Apr 4 2025 4:13 PM

Interesting Details About Google CEO Sundar Pichai Wife Anjali Pichai

ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో 'సుందర్ పిచాయ్' ఒకరు. ఈయన నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఒక సలహా అని, ఆ సలహా ఇచ్చిన వ్యక్తి తన భార్య 'అంజలి పిచాయ్' అని బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో అంజలి పిచాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

రాజస్థాన్‌లో జన్మించిన అంజలి, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెమికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ సమయంలో సుందర్ పిచాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది.

ఆ తరువాత సుందర్ పిచాయ్, అంజలి పెళ్లి చేసుకున్నారు. మొదట అంజలి తన కెరీర్‌ను యాక్సెంచర్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా ప్రారంభించింది. ఈ ఉద్యోగంలో మూడేళ్లు ఉన్న తరువాత.. ప్రముఖ ఆర్థిక సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇంట్యూట్‌కు మారింది, ప్రస్తుతం ఆమె అక్కడ కీలక నిర్వహణ పాత్రను పోషిస్తోంది. అంజలి పిచాయ్.. ఇంట్యూట్‌లో కెమికల్ ఇంజనీర్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నారు. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా మంచి జాబ్ ఆఫర్ ఇచ్చింది.

మైక్రోసాఫ్ట్, ట్విటర్ కంపెనీలలో జాబ్ ఆఫర్ రావడంతో.. సుందర్ పిచాయ్ గూగుల్ జాబ్ వదిలేయాలకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య అంజలికి చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు.

సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరిగా ఎదగడానికి అంజలి మద్దతుగా నిలిచారు. సుందర్ తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు చాలా కాలం విడిపోయిన తర్వాత కూడా.. అంజలికి అతనిపై ఉన్న దృఢమైన నమ్మకం అతని విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇదీ చదవండి: రతన్ టాటా వీలునామా.. ఎవరికి ఎంత కేటాయించారంటే?

సుందర్ పిచాయ్, అంజలి.. ఇప్పుడు కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ హిల్స్‌లో వారి ఇద్దరు పిల్లలు కావ్య, కిరణ్‌లతో నివసిస్తున్నారు. 2023లో ఆమె వృత్తిపరమైన విజయాలు.. సహకారాలకు గాను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆమెను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం అంజలి మొత్తం సంపద రూ.830 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement