ఇన్ఫీ షేరు పాతాళానికి, 6 శాతం నష్టాలతో ఐదేళ్ల కనిష్టానికి
సీఈవోకు రూ. రూ.52 కోట్లు
ఉద్యోగుల జీత భత్యాల పెంపు నిర్ణయం ఇంకా పెండింగ్లో
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తీసుకున్న నిర్ణయం చర్చకు దారి తీసింది. ఒకవైపు సీఈఓకు భారీగా బోనస్లు స్టాక్ ఇన్సెంటివ్లను ప్రకటించింది. మరోవైపు సాధారణ ఉద్యోగుల జీతాల పెంపుపై కంపెనీ ఇంకాఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్కు సుమారు రూ.52 కోట్ల విలువైన స్టాక్ ఇన్సెంటివ్లను (స్టాక్ గ్రాంట్లు) ఆమోదించింది. ఈ గ్రాంట్లలో పనితీరు, ఈఎస్జీ, టీఎస్ఆర్, వార్షిక ఈక్విటీ అవార్డులు ఉన్నాయి. నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా బోర్డు ఆమోదించిన ఈ గ్రాంట్లు, పరేఖ్ వార్షిక పనితీరు ఆధారిత పరిహార నిర్మాణంలో భాగమని ఈ ఐటీ దిగ్గజం ఏప్రిల్ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.
దీని ప్రకారం వార్షిక పనితీరు ఈక్విటీ గ్రాంట్: రూ.34.75 కోట్లు, ESG (పర్యావరణ, సామాజిక, పాలన): రూ.2 కోట్లు, TSR (మొత్తం వాటాదారుల రాబడి): రూ.5 కోట్లు, 2019 పనితీరు ప్రణాళిక కింద: రూ.10 కోట్లు, మొత్తం విలువ: సుమారు రూ.51.75 కోట్లు ఈ స్టాక్ యూనిట్లు (RSUs) మే 2 నుండి అమల్లోకి వస్తాయి. బోర్డు నిర్ణయించిన పనితీరు మైలురాళ్లను బట్టి ఇవి ఒకటి నుండి రెండు ఏళ్లలోపు ఆయనకు అందుతాయి. గత ఏడాది కూడా ఆయనకు సుమారు రూ.50 కోట్ల విలువైన స్టాక్ ఇన్సెంటివ్లు లభించాయి.
ఉద్యోగుల జీతాల పెంపు మాట ఏంటి?
ఐటీ రంగంలో వృద్ధి నెమ్మదించడం, కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవాలని చూడటం వల్ల జీతాల పెంపుపై సందిగ్ధత నెలకొంది. దీనిపై వివరణ ఇస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతాల పెంపు సమయం, పరిమాణంపై ఇంకా సమీక్ష జరుగుతోందని ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ (CFO) జయేష్ సంఘరాజ్కా తెలిపారు.
ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్
6 శాతం కుప్పకూలిన షేర్
శుక్రవారం నాటి స్టాక్మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్ టాప్ లూజర్గా నిలిచింది. దాదాపు 6 శాతం దాకా కుప్పకూలింది. దీంతో షేర్ విలువ ఐదేళ్లకు పైగా కనిష్ట స్థాయికి పడిపోయింది . FY27 వృద్ధి అంచనాలు మందకొడిగా ఉండటంతో ఇన్ఫోసిస్ షేర్లు 6 శాతం పడిపోయాయి. బలహీనమైన అంచనాలు, తీవ్రమవు తున్న పోటీ కారణంగా ఎనలిస్టులు వెల్లడించారు. నాలుగో త్రైమాసికంలో నికర లాభం 27.8 శాతం పెరిగి, రూ.8,501 కోట్లుగా నమోదైంది.ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.46,402 కోట్లుగా ఉంది.2026-27 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి 1.5 శాతం నుండి 3.5 శాతం మధ్య ఉండవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కానీ ఆదాయ వృద్ధి మాత్రం నిరాడంబరంగా ఉంది.
ఇదీ చదవండి: అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు


