ఆరోనెలా అగాధంలోనే ఎగుమతులు!

Indias Exports Continued To Decline For The sixth Consecutive Month - Sakshi

ఆగస్టులో 12.66 శాతం క్షీణత

విలువలో 22.7 బిలియన్‌ డాలర్లు

దిగుమతులదీ క్షీణబాటే

26% మైనస్‌తో 29.47 బిలియన్‌ డాలర్లకు డౌన్‌

వాణిజ్యలోటు 6.77 బిలియన్‌ డాలర్లు  

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా ఆరవ నెల ఆగస్టులోనూ క్షీణతలోనే కొనసాగాయి. 2019 ఆగస్టుతో పోల్చిచూస్తే, 12.66 శాతం క్షీణించి 22.70 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా బలహీన డిమాండ్‌ ధోరణి దీనికి ప్రధాన కారణం. ఇక దేశీయంగా కూడా తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితులను సూచిస్తూ, దిగుమమతులు 26 శాతం క్షీణించాయి. విలువలో 29.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 6.77 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో  ముఖ్యాంశాలు...
* పెట్రోలియం, తోలు, ఇంజనీరింగ్‌ గూడ్స్, రత్నాలు, ఆభరణాలు ఎగుమతుల్లో  క్షీణత నమోదయ్యింది.   
* పసిడి దిగుమతులు మాత్రం దాదాపు మూడురెట్లు పెరిగి 3.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2019 ఆగస్టులో ఈ విలువ 1.36 బిలియన్‌ డాలర్లు.  
* 5 నెలల్లో 20.72 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు 
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య చూస్తే, ఎగుమతులు 26.65 శాతం క్షీణతతో 97.66 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 43.73 శాతం క్షీణతతలో 118.38 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు  20.72 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. (ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు )

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top