అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం | Sakshi
Sakshi News home page

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

Published Thu, Oct 28 2021 5:54 PM

India Successfully Test Fires Agni 5 Missile - Sakshi

ఒడిశాలోని ఎపీజె అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీఓ అక్టోబర్ 27న విజయవంతంగా పరీక్షించింది. అత్యంత ఖచ్చితత్త్వంతో 5,000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ఈక్షిపణి కలిగి ఉంది. ఈ క్షిపణి సుమారు 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, సుమారు 50 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ఒక టన్ను కంటే ఎక్కువ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ.. తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. 

హైపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటని ఇటీవల ఒక యుఎస్ కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. ఈ ఖండాతర క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంతో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. అలాగే, మ్యాక్ 7 హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ 2ని భారత్ రష్యాతో కలిసి అభివృద్ది చేస్తుంది. భారతదేశం తన హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ, ద్వంద్వ సామర్థ్యం కలిగిన హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా అభివృద్ధి చేస్తోంది. జూన్ 2019, సెప్టెంబర్ 2020లో మ్యాక్ 6 స్క్రామ్ జెట్ ను విజయవంతంగా పరీక్షించింది. 

(చదవండి: ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!)

Advertisement

తప్పక చదవండి

Advertisement