పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు! | India headed for sharp fuel price hike after states assembly elections: Report | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు!

Feb 9 2022 9:50 PM | Updated on Feb 9 2022 9:59 PM

India headed for sharp fuel price hike after states assembly elections: Report - Sakshi

గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు అని సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఇది కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అని సమాచారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ టచి తోమత్సు ఇండియా పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

మార్చి 10 తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ ధరలను పెంచలేదు అని వివరించారు. అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే పెంచలేదు అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత భారీగా ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు.

ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన అందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని ప్రజల మీద వేసే అవకాశం ఉన్నట్లు మిశ్రా తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు దెబ్బతీస్తుందని మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు.

(చదవండి: అమెజాన్ ఉద్యోగులకు బంపరాఫ‌ర్‌.. భారీగా పెరగనున్న వేతనం!)

Advertisement
 
Advertisement
Advertisement