పెడచెవిన పెట్టడంతో రూ.12వేల కోట్ల నష్టం! | India Loses as Govt Rejects Anti Dumping Duty Rs 28000 Cr Forex at Risk | Sakshi
Sakshi News home page

పెడచెవిన పెట్టడంతో రూ.12వేల కోట్ల నష్టం!

May 27 2026 8:25 AM | Updated on May 27 2026 8:48 AM

India Loses as Govt Rejects Anti Dumping Duty Rs 28000 Cr Forex at Risk

యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధించని కేంద్రం

రూ.28వేల కోట్ల మారకద్రవ్యం కోల్పోయే పరిస్థితి

డీజీటీఆర్‌ అధ్యయనంలో వెల్లడి 

చౌక దిగుమతులను అడ్డుకునేందుకు యాంటీ డంపింగ్‌ డ్యూటీ (సుంకాలు) విధించాలన్న సిఫారసులను కేంద్రం అమలు చేయకపోవడంతో.. దేశీ పరిశ్రమకు రూ.11,938 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు తేలింది. అంతేకాదు ఒకవేళ ఈ యాంటీ డంపింగ్‌ సుంకాలు విధించినట్టయితే, దిగుమతులను నివారించడం రూపంలో ఏటా రూ.28,450 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

చౌక దిగుమతులు దేశీ పరిశ్రమకు ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో డీజీటీఆర్‌ అధ్యయనం చేసి, సిఫారసులు చేస్తుంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది. 56 ఉత్పత్తులకు సంబంధించి యాంటీ డంపింగ్‌ సుంకాలు విధించాలంటూ ఇప్పటి వరకు డీజీటీఆర్‌ సిఫారసు చేయగా, వీటిని అమలు చేయని కారణంగా దేశీ పరిశ్రమ ఏటా రూ.11,938 కోట్లను నష్టపోతున్నట్టు తెలిసింది.

ఉపాధికీ నష్టమే..

33 ఉత్పత్తుల దిగుమతుల రూపంలోనే రూ.1.54 లక్షల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడినట్టు డీజీటీఆర్‌ గుర్తించింది. 2030 నాటికి ఈ నష్టం రూ.2.70 లక్షల కోట్లకు పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుతం 24,000 ఉద్యోగాలు నష్టపోయే పరిస్థితి ఉండగా, 2030 నాటికి ఇది 38,000–42,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశీ సామర్థ్యాలు, పెట్టుబడులు, ద్రవ్యోల్బణం తదితర అంశాలనూ డీజీటీఆర్‌ తన అధ్యయనంలో భాగంగా పరిగణనలోకి తీసుకుంది.

విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను రక్షించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూటీవో సభ్య దేశాలు యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధించడం సర్వసాధారణం. ఒక ఉత్పత్తిని సాధారణ విలువ కంటే తక్కువ ధరకు ఎగుమతి చేయడాన్ని డంపింగ్‌ (కుమ్మరించడం)గా భావిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే 2020 వరకు డీజీటీఆర్‌ సిఫారసుల్లో 99.5 శాతం అమలయ్యాయి. కానీ, ఇటీవలి కాలంలో తిరస్కరణ రేటు పెరిగిపోయింది. 2025 ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో 16 శాతం సిరఫారసులనే తిరస్కరించగా, 2025 నవంబర్‌ నుంచి 2026 ఏప్రిల్‌ కాలంలో 81 శాతానికి పెరిగినట్టు డీజీటీఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. రూపాయి విలువ క్షీణత, తగ్గిపోతున్న విదేశీ మారకం నిల్వలు కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో కేంద్ర సర్కారు పలు చర్యలు తీసుకుంటున్న క్రమంలో డీజీటీఆర్‌ నివేదికలోని విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement
 
Advertisement
Advertisement