గత రెండు వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో.. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మే 15 తర్వాత నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడంతో ప్రజల రోజువారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 నుంచి రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.95.2కు పెరిగింది. అదే సమయంలో సీఎన్జీ ధరలు కూడా కేజీపై సుమారు రూ.4 వరకు పెరిగింది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. ముఖ్యంగా అక్కడి యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులపై మాత్రమే కాదు, సాధారణ కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సరుకుల రవాణాకు ఇంధనం కీలకం. రైతుల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగడంతో వాటి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
ఇప్పటికే వంటింటి ఖర్చులు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధర కేజీకి రూ.11.2 పెరిగింది. సోయా ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోకు రూ.7కిపైగా పెరగగా, నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వంటనూనెల విషయంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం వల్ల ప్రపంచ మార్కెట్ ప్రభావం నేరుగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకేసారి రెండు రకాల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రయాణ ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు వంటింటి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే సాధారణ జీవనం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!


