వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్! | Nitin Gadkari Unveils New Stove Tech Can Ethanol Replace LPG in Indian Homes | Sakshi
Sakshi News home page

గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!

May 25 2026 7:44 PM | Updated on May 25 2026 9:12 PM

Nitin Gadkari Unveils New Stove Tech Can Ethanol Replace LPG in Indian Homes

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బయోఫ్యూయల్ మిషన్‌లో మరో ప్రధాన ముందడుగును సూచిస్తుంది.

నాగ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఇథనాల్ ఆధారిత కొత్త స్టవ్‌ ద్వారా, వంట గ్యాస్ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతోనే వంట చేయవచ్చని తెలిపారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా పేర్కొన్నారు. ఇథనాల్‌ను నీటితో కలిపి మంటను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇది సంప్రదాయ ఎల్‌పీజీ వంటి ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గృహ వినియోగానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.

భారతదేశం చమురు అవసరాల కోసం.. సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కలిపి వినియోగించడం కొనసాగుతోంది. 2014లో 1.5 శాతం నుంచి 2025 నాటికి దాదాపు 20 శాతానికి ఇథనాల్ వినియోగం పెరిగింది.

ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!

ఇథనాల్ అనేది ప్రధానంగా.. చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది మండినప్పుడు కూడా తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అందువల్ల దీనిని పర్యావరణహిత ఇంధనంగానే పరిగణిస్తారు.

ఈ కొత్త టెక్నాలజీ విజయవంతమైతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్‌పై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇదే జరిగితే.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. సరఫరా మాత్రమే కాకుండా.. భద్రత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సాధ్యమైతేనే ప్రజలు దీనిని విశ్వసిస్తారు. వినియోగించడానికి ముందుకు వస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement