రూపాయి పతనాన్ని అడ్డుకోకూడదు.. | Petrol Price Hike Justified, Ahluwalia Says Rupee Fall Shouldn't Be Stopped | Sakshi
Sakshi News home page

రూపాయి పతనాన్ని అడ్డుకోకూడదు..

May 27 2026 8:19 AM | Updated on May 27 2026 8:50 AM

Petrol Price Hike Justified, Ahluwalia Says Rupee Fall Shouldn't Be Stopped

ప్రస్తుత అంతర్జాతీయ, దేశీయ పరిస్థితుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచడం సబబేనని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇది తప్పనిసరి చర్య అని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోకపోతే మనకు ఎకానమీని ఎలా నిర్వహించాలో తెలియదనే తప్పుడు సంకేతాలు వెళ్లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

అహ్లూవాలియా ఏమన్నారంటే..

  • ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రో ధరల పెంపు సబబే. తప్పదు కూడా. లేదంటే మనకు ఎకానమీని ఎలా చక్కదిద్దాలో తెలియదనే అభిప్రాయం కలిగేది. గతంలో మేము కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచాము, ప్రస్తుత ప్రభుత్వమూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.

  • పశ్చిమాసియా సంక్షోభం ఇంకెంత తీవ్ర రూపం దాల్చుతుందో మనకు కచ్చితంగా తెలియదు, కాబట్టి దూరదృష్టితో ఆలోచించాలి. హార్మూజ్‌ జలసంధి తెరుచుకునే విషయంలో స్పష్టత లేదు. నిజానికి క్రూడ్‌ ధరలు మరింత పెరిగితే, రానున్న రోజుల్లో పెట్రో ధరలను ఇంకా పెంచాల్సి వస్తుంది. ఎరువుల రేట్లు కూడా భారీగా ఎగబాకే అవకాశం ఉంది.

  • మొదట్లో ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు (రూ.10) రూపంలో ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించింది. ఇంకా భరిస్తే, ద్రవ్యలోటు ఎగబాకుతుంది. పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ రద్దయి చాలా ఏళ్లయినా, నిజానికి అది ఇంకా కొనసాగుతూనే ఉంది.

  • ఎకానమీ గురించి ప్రజలను భయాందోళనలకు గురి చేయను కానీ, మన ఆర్థిక వ్యవస్థకు కొన్ని బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. క్రూడ్‌ ధర పెరుగుదల ఒక్కటే దీనికి కారణం కాదు. కొన్నేళ్లుగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఎగుమతుల పనితీరు అశించిన స్థాయిలో లేదు. ఇది ఎకానమీని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

  • డాలరుతో రూపాయి మారకం విలువ 100ను తాకుతుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నంబర్లకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. అధిక క్రూడ్‌ ధరలు, దిగుమతుల భారం కారణంగా రూపాయి క్షీణత అనివార్యమే. తగ్గడానికి అనుమతించడం మంచిదే. కరెన్సీ విలువ అనేది మార్కెట్‌ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది, కాబట్టి దాన్ని మార్కెట్‌ వర్గాలకే వదిలేయాలి. రూపాయి మరీ క్షీణించిందని భావిస్తే, మార్కెట్లే  తిరిగి సరైన స్థాయి చేర్చి, గాడిలో పెడతాయి. కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలను వాడటం సరికాదు.

  • యూకే, ఈయూలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు   కుదుర్చుకోవడం మంచి ఆలోచన. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆధార్‌ మరింత బలోపేతం అయింది. భారీ డిజిటల్‌ ఇన్‌ఫ్రాగా తీర్చిదిద్దారు. తొలుత జీఎస్‌టీని వ్యతిరేకించినా.. తర్వాత అమల్లోకి తెచ్చారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ వంటివి చాలా కీలకమైనవి.  చాలా కఠిన నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయి.

  • జీడీపీ వృద్ధి విషయంలో మనం గమ్యానికి చాలా దూరంలో ఉన్నాం. మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రధాన మంత్రే స్వయంగా రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌ అనే నినాదం ఇచ్చారు.  

  • కాబట్టి, సబ్సిడీలు, సంస్కరణల విషయంలో పునఃసమీక్షకు ఇది మంచి తరుణం, అత్యవసరం కూడా. నీతి ఆయోగ్‌ ద్వారా లేదా ఏదైనా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, విస్తృతంగా చర్చించాలి. ఈ మార్పుల ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement
 
Advertisement
Advertisement