చివరి దశకు చర్చలు, భారత్‌లో టెస్లా కార్లు తిరిగేది ఎప్పుడంటే? | India Close To Finalizing Agreement With Tesla To Import Electric Vehicles | Sakshi
Sakshi News home page

చివరి దశకు చర్చలు, భారత్‌లో టెస్లా కార్లు తిరిగేది ఎప్పుడంటే?

Nov 21 2023 1:57 PM | Updated on Nov 21 2023 2:34 PM

India Close To Finalizing Agreement With Tesla To Import Electric Vehicles - Sakshi

భారత్‌లో ‘టెస్లా’ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కేంద్ర ప్రభుత్వంతో చేసుకోనున్న ఒప్పంద ప్రయత్నాలు దాదాపు తుది అంకానికి చేరాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌-టెస్లాల మధ్య ఒప్పందం పూర్తయితే మరో రెండేళ్లలో దేశీయంగా టెస్లా ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. దీంతో టెస్లా కార్లు రయ్‌.. రయ్‌ మంటూ చక్కెర్లు కొట్టనున్నాయి. 

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌ రాష్ట్రంలో వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పాల్గొనే ఈ ఈవెంట్‌లో భారత్‌ - టెస్లాల మధ్య జరగనున్న ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఈ సమ్మిట్‌లోనే ఎందుకు? టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌పై ప్రకటన వస్తుందనే అంశంపై.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ కేంద్రంగా ఇన్వెస్టర్ల సమావేశం, ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతులకు అనువైన ప్రాంతాల్ని టెస్లా యాజమాన్యం గుర్తించిందని కాబట్టే ప్రకటన పరిశీలనలో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.   

టెస్లా కనీస పెట్టుబడులు 
దేశీయంగా టెస్లా ప్లాంట్‌ను నిర్మించేందుకు ఎలాన్‌ మస్క్‌ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా హామీ ఇచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా టెస్లా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కనీస పెట్టుబడి కింద మస్క్‌ 2 బిలియన్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. కారు తయారీ కోసం కావాల్సిన ఇతర కారు పార్ట్స్‌ని దేశీయ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు 15 బిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నారు. ఖర్చు తగ్గించుకునేలా మనదేశంలో కొన్ని బ్యాటరీలను తయారు చేయాలనే యోచనలో ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. 

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
పైన తెలిపినట్లుగా..దేశీయంగా టెస్లా- భారత్‌ల మధ్య ఒప్పందాలు ఎలా కొనసాగుతున్నాయనే అంశంపై అటు కేంద్రంగాని ఇటు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ నుంచి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement