
హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ కస్టమర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న కొత్తతరం కస్టమర్లకు విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లను కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగినట్టుగానే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
ప్రధాన నగరంలో కష్టమే..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్య, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లలు సంపాదన కూడా తోడైంది. 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని, దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.