దూసుకెళ్తున్న జీఎస్‌టీ వసూళ్లు!

GST Collections in November Increased the Second Highest - Sakshi

న్యూఢిల్లీ: నవంబర్ నెలలో కూడా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. వరుసగా ఐదో నెలా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. 2021 నవంబరులో వసూలైన జీఎస్‌టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్‌టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ - రూ.23,978 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ - రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ - రూ.66,815 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి.

ఈ సమ్మిళిత జీఎస్‌టీ వాటా రూ.66,815 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,165 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.9,606 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.రూ.653 కోట్లతో సహా) . గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్‌టీ ఆదాయంతో పోలిస్తే నవంబర్ 2021లో సేకరించిన జీఎస్‌టీ ఆదాయం 25 శాతం పెరిగింది. 2019-20తో పోలిస్తే కంటే 27 శాతం పెరిగింది. ఈ సమ్మిళిత జీఎస్‌టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,273 కోట్లు, రాష్ట్రాలతో 22,655 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ. 51,251 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.53,782 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 3న జీఎస్‌టీ పరిహారం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసింది.

(చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top