దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం నవంబర్లో 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2024) నవంబర్లో 9.8 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయి.
2025 అక్టోబర్లో మూడు రెట్లు ఎగసి 14.72 బిలియన్ డాలర్లను తాకిన పసిడి దిగుమతులు ఈ ఏడాది(2025) ఏప్రిల్–నవంబర్ కాలంలో 3.3 శాతం పెరిగి 45.26 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 43.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. పసిడి దిగుమతులు క్షీణించడంతో గత నెలలో దేశ వాణిజ్య లోటు తగ్గి 24.53 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. దిగుమతులు నీరసించడంతో దిగుమతుల బిల్లు సైతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.


