వెనకడుగులో.. పసిడి, వెండి
ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 51,782కు
ఎంసీఎక్స్లో కేజీ వెండి రూ. 66,224 వద్ద ట్రేడింగ్
న్యూయార్క్ కామెక్స్లో 1,939 డాలర్లకు పసిడి
స్పాట్ మార్కెట్లోనూ ఔన్స్ 1,933 డాలర్లకు
26.65 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్ వెండి ధర
కొద్ది రోజులుగా ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలహీనపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లోనూ.. వరుసగా రెండో రోజు నష్టాల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 234 క్షీణించి రూ. 51,782వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 843 నష్టంతో రూ. 66,224 వద్ద కదులుతోంది.
శుక్రవారమిలా
వారాంతాన ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 135 క్షీణించి రూ. 52,016 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,409 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,239 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 528 తక్కువగా రూ. 67,067 వద్ద నిలిచింది. ఒక దశలో 68,900 వరకూ ఎగసిన వెండి తదుపరి రూ. 65,201 వరకూ పతనమైంది.
కామెక్స్లోనూ వీక్
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం బలహీనపడి 1,939 డాలర్ల సమీపంలో కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం వెనకడుగుతో 1,933 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఔన్స్ 0.8 శాతం క్షీణించి 26.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఫ్యూచర్స్లో పసిడి 0.5 శాతం బలపడి 1947 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్లో 0.4 శాతం క్షీణించి 1941 డాలర్ల దిగువన ముగిసింది. ఇక వెండి 1.6 శాతం నష్టంతో 27 డాలర్ల వద్ద స్థిరపడింది.