ట్రావెల్‌కి హోలీ జోష్‌ | flight bookings for Holi week 2026 have jumped by 70 to 75 percent growth | Sakshi
Sakshi News home page

ట్రావెల్‌కి హోలీ జోష్‌

Mar 1 2026 4:49 AM | Updated on Mar 1 2026 4:48 AM

flight bookings for Holi week 2026 have jumped by 70 to 75 percent growth

70 శాతం పెరిగిన ఫ్లయిట్, బస్‌ బుకింగ్స్‌ 

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు అత్యధిక ప్రయాణాలు 

ఇక్సిగో, అభిబస్‌ నివేదికల్లో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హోలీ పండుగ నేపథ్యంలో ప్రయాణాలు ఊపందుకున్నాయి. కుటుంబాలతో కలిసి వేడుకలు జరుపుకొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు బైల్దేరుతుండటంతో విమానాలు, బస్సులకు డిమాండ్‌ నెలకొంది. దేశీయంగా అగ్రగామి ఏఐ ఆధారిత ట్రావెల్‌ ప్లాట్‌ఫాం ఇక్సిగో ప్రకారం హోలీ పండుగ వారాంతానికి సంబంధించి ఫ్లయిట్‌ బుకింగ్స్‌ వార్షిక ప్రాతిపదికన 70–75 శాతం పెరిగాయి. 

ఇక ఇక్సిగోలో బస్సుల విభాగం అభిబస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ 70 శాతం పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకి కూడా ఫ్లయిట్, బస్సు సర్వీసులకు భారీగా డిమాండ్‌ నెలకొంది. ఫ్లైట్‌ బుకింగ్స్‌లో 94 శాతం వృద్ధితో గోరఖ్‌పూర్‌ అగ్రస్థానంలో ఉండగా భోపాల్‌ (89 శాతం), కాన్పూర్‌ (86 శాతం), దర్భంగా (76 శాతం), వారణాసి (72 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వారం మధ్యలో హోలీ రావడంతో వారాంతం వరకు సెలబ్రేట్‌ చేసుకునేలా ప్రజలు ట్రిప్‌లను ప్లాన్‌ చేసుకుంటున్నారని ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు అలోక్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు.  

హైదరాబాద్‌ జోరు.. 
మెట్రో నగరాల విషయానికొస్తే 108 శాతం ఫ్లయిట్‌ బుకింగ్స్‌ వృద్ధితో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అహ్మదాబాద్‌ (118 శాతం), మూడో స్థానంలో చెన్నై (101 శాతం) ఉన్నాయి. ఇక అత్యధిక డిమాండ్‌ నెలకొన్న రూట్లలోని రైళ్లలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్టులు ఉండటంతో గమ్యస్థానాలను చేరుకునేందుకు ట్రావెలర్లు బస్సులవైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరుకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ 70 శాతం పెరిగాయి. అటు బెంగళూరు–చెన్నై కారిడార్‌లో 65 శాతం, ముంబై నుంచి పుణె, నాగ్‌పూర్‌ రూట్లలో 75 శాతం పెరిగాయి.   

క్రికెట్‌ ఫీవర్‌ కూడా తోడు.. 
టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సందడి కూడా ప్రయాణాలకు ఊతమిస్తోంది. కీలక మ్యాచ్‌లు జరిగే ప్రాంతాల్లో ఫ్లయిట్‌ సరీ్వసులు, హోటళ్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. హోమ్‌ షేరింగ్‌ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ ప్రకారం మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే నగరాల్లో హోటళ్ల కోసం ఆన్‌లైన్‌ సెర్చ్‌లు రెండు రెట్లు పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద స్టేడియం ఉన్న అహ్మదాబాద్‌లో మార్చి 7–10 మధ్య బస చేసేందుకు అనువైన హోటళ్ల కోసం సెర్చ్‌లు 170 శాతం ఎగిశాయి. 

అయితే, ఈ ధోరణి కీలక మెట్రో హబ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా కనిపించడం గమనార్హం. రాంచీలో సెర్చ్‌లు 120 శాతం, తిరువనంతపురంలో 110 శాతం, జైపూర్‌లో 70 శాతం ఎగిశాయి. కొన్ని ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ప్రకారం ఫిబ్రవరి–మార్చి మధ్య కాలంలో మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న నగరాలకు ఎయిర్‌ ట్రావెల్‌ బుకింగ్స్‌ 25–30 శాతం పెరిగాయి. అదే విధంగా మ్యాచ్‌లున్న రోజుల్లో హోటల్‌ సెర్చ్‌లు 20–25 శాతం వృద్ధి చెందాయి.  

ట్రిప్‌ల పొడిగింపు.. 
ఆధ్యాతి్మక టూరిజం లేదా వేసవి సెలవులతో పోలిస్తే ఇలాంటి పర్యటనల వ్యవధి తక్కువే ఉంటుందని, కాకపోతే మ్యాచ్‌ల తర్వాత కూడా ట్రిప్‌ కొన్ని రోజుల పాటు పొడిగించుకునే అవకాశం ఉందని ఈజ్‌మైట్రిప్‌ సీఈవో రికాంత్‌ పిట్టీ తెలిపారు. స్థానిక సంస్కృతి, వంటకాల గురించి తెలుసుకునేందుకు, దగ్గర్లోని ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారని ఎయిర్‌బీఎన్‌బీ వర్గాలు తెలిపాయి. క్రికెట్‌ టూరిజానికి సంబంధించి ఎక్కువ శాతం పర్యాటకులు యువ ట్రావెలర్లే ఉంటున్నారని వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement