పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.
ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!
చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)
తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..
ఉమెన్స్ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీచరణి తండ్రి
మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.
అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..
తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..
⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు.
⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది.
⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్కు భారత జట్టు తరఫున ఎంపికైంది.
⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్గా ఘనత సాధించింది.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..
చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్కుమార్రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది.
– మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడప
దిసీజ్ ఫర్ యూ..!
‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..
‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను.
క్రికెట్ ఫస్ట్..
మేముండేది సైనిక్పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది.
పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...
2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది.
ధైర్యమే పెద్ద సపోర్ట్
అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.
ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


