నెలకు 40 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులు

Exports Rise 40 Billion Dollars In Fy 21-22 - Sakshi

2021–22లో భారత్‌ రికార్డు

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటును 40 బిలియన్‌ డాలర్లు దాటి చరిత్ర సృష్టించాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు తాజాగా గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. 
►  ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాల మేరకు భారత్‌ 420 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది.  
►    మొత్తం ఎగుమతులు 419.65 బిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 611.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 192.24 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు 102.63 బిలియన్‌ డాలర్లే కావడం గమనార్హం.  
►   ఇక ఒక్క సేవల రంగాన్ని చూస్తే, 2021–22లో ఎగుమతుల విలువ చరిత్రాత్మక గరిష్ట స్థాయి  249.24 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2020–21 ఇదే కాలంతో పోల్చి చూస్తే (206.09 బిలియన్‌ డాలర్లు) విలువ 21 శాతం పెరిగింది. ఇక సేవల దిగుమతులు ఇదే కాలంలో 23.20% పెరిగి 144.70 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2020–21లో ఈ విలువ 117.52 బిలియన్‌ డాలర్లు.  వెరసి ఒక్క సేవల రంగంలో వాణిజ్య మిగులు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 17.94 శాతం పెరిగి 88.57 బిలియన్‌ డాలర్ల నుంచి 104.45 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top