
ఎల్రక్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) ప్రమోటర్ సునీల్ వాచని కంపెనీలో 2.77 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 13,301.47 సగటు ధరలో 16.7 లక్షల షేర్లను అమ్మివేశారు. తద్వారా రూ. 2,221 కోట్లకుపైగా అందుకున్నారు. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం కంపెనీ చైర్పర్శన్ సునీల్ వాటా దీంతో డిక్సన్లో 5.34 శాతం నుంచి 2.57 శాతానికి క్షీణించింది. మొత్తం ప్రమోటర్ల వాటా 32.27 శాతం నుంచి 29.5 శాతానికి దిగివచ్చింది.
మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ రెండు దశలలో 2.39 శాతం వాటాకు సమానమైన 14.45 లక్షల డిక్సన్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 13,308 సగటు ధరలో ఇందుకు రూ. 1,924 కోట్లు వెచ్చించింది. ఈ లావాదేవీ తదుపరి డిక్సన్ టెక్నాలజీస్లో మోతీలాల్ ఎంఎఫ్ వాటా 2.24 శాతం నుంచి 4.63 శాతానికి ఎగసింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ నికర లాభం రూ. 97 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..
ఇందుకు కన్సాలిడేటెడ్ ఆదాయం రెట్టింపునకుపైగా జంప్చేసి రూ. 10,293 కోట్లకు చేరడం సహకరించింది. 2023–24లో రూ. 4,658 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. పూర్తి ఏడాదికి(2024–25) ఆదాయం రూ. 17,691 కోట్ల నుంచి రూ. 38,860 కోట్లకు బలపడగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 375 కోట్ల నుంచి రూ. 1,233 కోట్లకు ఎగసింది.