వహ్వా.. దివీస్‌ ల్యాబ్‌- అబాట్‌ ఇండియా | Divis Lab- Abbott India jumps on Q1 results | Sakshi
Sakshi News home page

దివీస్‌ ల్యాబ్‌- అబాట్‌ ఇండియా హైజంప్‌

Aug 10 2020 9:53 AM | Updated on Aug 10 2020 9:57 AM

Divis Lab- Abbott India jumps on Q1 results  - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్‌ ల్యాబొరేటరీస్‌, గ్లోబల్‌ కంపెనీ అబాట్‌ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి.  వారాంతాన ఈ రెండు కంపెనీలూ ఫలితాలు విడుదల చేయడంతో నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. దివీస్‌ ల్యాబ్‌ 15 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను సైతం తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం..

దివీస్‌ ల్యాబొరేటరీస్‌
ఎన్‌ఎస్‌ఈలో తొలుత దివీస్‌ ల్యాబ్‌ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 3,293ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 3,170 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో దివీస్‌ ల్యాబ్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్‌-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. 

అబాట్‌ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో తొలుత అబాట్‌ ఇండియా షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 17,350 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 16,901 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో అబాట్‌ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement