కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం

Direction of corporate second quarter financial results - Sakshi

స్థూల ఆర్థిక గణాంకాలు..,

ప్రపంచ పరిణామాలపైనా దృష్టి

దసరా సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు

ఈ వారం స్టాక్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ దిశా నిర్దేశం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణ లెక్కలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ మార్కెట్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ కదలికలు తదితర అంశాలూ స్టాక్‌ సూచీల గమనాన్ని శాసించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.

‘‘నిఫ్టీకి 17450 స్థాయి వద్ద బలమైన మద్దతు లభించిన తర్వాత బౌన్స్‌బ్యాక్స్‌ అయ్యింది. ఈ సూచీ ఇప్పటికీ అధిక విలువతో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., సాంకేతికంగా దిద్దుబాటయ్యే సూచనలు సూచనలు కనిపించడం లేదు. ఈ వారంలో 18,000 స్థాయిని అధిగమించవచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్స్‌ హెడ్‌ రీసెర్చ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. అధిక వెయిటేజీ దిగ్గజం రిలయన్స్‌తో పాటు ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 1,293 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 363 పాయింట్లు పెరిగింది.

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే...
కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ మొదలు...
ఐటీ దిగ్గజం టీసీఎస్‌ గత శుక్రవారం క్యూ2 ఆర్థిక గణాంకాలను వెల్లడించి ఫలితాల సీజన్‌కు తెరతీసింది. ఆర్థిక ఫలితాల ప్రభావం సోమవారం (11న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఈ వారంలోనే ఇన్ఫోసిస్, విప్రో, మైండ్‌ ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్ట్, డెల్టా కార్ప్, హెచ్‌ఎఫ్‌సీఎల్, సైయంట్, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌తో సహా దాదాపు 50కి పైగా కంపెనీలు తమ రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు.

ద్రవ్యోల్బణ లెక్కలపై దృష్టి ...
కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం(12న) ఆగస్ట్‌ నెల పారిశ్రామికోత్పత్తి, సెపె్టంబర్‌ రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను వెల్లడించనుంది. సెపె్టంబర్‌ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) విడుదల కానుంది. సెప్టెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 4.3శాతంగా, ఆగస్ట్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.2శాతంగా నమోదుకావచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది.

బాండ్‌ ఈల్డ్స్‌ భయాలు...
భారత పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 18 నెలల గరిష్టస్థాయి 6.32 శాతానికి చేరుకుంది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు మార్కెట్లో అధిక ద్రవ్యత లభ్యత ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఈల్డ్స్‌ మరింత పెరిగితే స్టాక్‌ మార్కెట్‌కు ప్రతికూలాంశంగా మారుతుంది.

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ లిస్టింగ్‌ నేడు..
ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ లిస్టింగ్‌ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. సెపె్టంబర్‌ 29 – అక్టోబర్‌ 1వ తేదిల మధ్య ఇష్యూ పూర్తి చేసుకున్న ఈ ఐపీఓ 5.25 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ధర శ్రేణిని రూ.712 గా నిర్ణయించి కంపెనీ మొత్తం రూ.2,768 కోట్లను సమీకరించింది. గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు చాలా తక్కువ ప్రీమియం ధరతో ట్రేడ్‌ అవుతున్నందున ఫ్లాట్‌ లేదా డిస్కౌంట్‌లో లిస్టింగ్‌ ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం.

బుల్లిష్‌ వైఖరితో విదేశీ ఇన్వెస్టర్లు...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లో ఈ అక్టోబర్‌లో ఇప్పటికి వరకు రూ.1,997 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.1,530 కోట్ల షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.467 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లను కొనేందుకు ఆస్తకి చూపుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top