7th pay Commission: కరువు భత్యంపై తేల్చేది నేడే

Central Government Hold Meeting Today To Take A Decision On DA, DR Arrears Which Are Pending Due To Corona - Sakshi

18 నెలులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిలిచిపోయిన డీఏ

పరిగణలోకి 7వ వేతన సంఘం సిఫార్సులు 

మూడు వాయిదాలు ఒకే సారి చెల్లింపు

నేడు సమావేశం నిర్వహిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ   

న్యూఢిల్లీ : ​కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తోన్న కరువు భత్యం అంశంపై ఈ రోజు కేంద్రం సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ జాయింట్‌ కన్సల్టేటివ్‌ మెషినరీ , డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌శాఖకు చెందిన ప్రతినిధులు జూన్‌ 26న సమావేశం కానున్నారు. 7వ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత కరువు భత్యం నిర్ణయించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.  

మూడు వాయిదాలు
కరోనా ఉధృతి కారణంగా  2020 జనవరి నుంచి కరువు భత్యం (డీఏ) ప్రకటించలేదు.  కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 2020 జనవరి - జూన్‌, 2020 జూన్‌ - డిసెంబరు, 2021 జనవరి - జూన్‌ వరకు ఇలా ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలు, పెన్షనర్లకు సంబంధించి మూడు డీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రోజు జరిగే సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంత డీఏ, డీఆర్‌లు ఇవ్వాలనే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.  అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బేసిక్‌ డీఏపై  2020 జనవరి - జూన్‌ కాలానికి  4 శాతం , 2020 జూన్‌ - డిసెంబరు కాలానికి  3 శాతం , 2021 జనవరి - జూన్‌ కాలానికి 4 శాతం డీఏ  పెరిగే అవకాశం ఉంది. 

28 శాతం 
7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు 2021 జులై నుంచి  డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం కనీస వేతనంగా రూ. 18,000లగా నిర్ణయించింది. దీనిపై 15 శాతాన్ని డీఏగా అమలు చేయాలని సూచించింది. దీంతో పాటు ఉద్యోగులకు 2.57 ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని చెప్పింది. 

1.15 కోటి మంది 
7వ వేతన సంఘ సిఫార్సులపై ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో వెల్లడికానున్న నిర్ణయం కోసం 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. 65 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరందరికీ గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌లు త్వరలోనే అందనున్నాయి. ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు బకాయిలు పడ్డ డీఏలను  జులై 1న ఒకేసారి చెల్లిస్తామంటూ ఇప్పటికే ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగానే కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు డీఏపై ఫైనల్‌ డెసిషన్‌ చెప్పేందుకు సమావేశం నిర్వహిస్తోంది. 

చదవండి : Toshiba: కుట్రలకు చెక్‌, చైర్మన్‌ తొలగింపు.. ఇక సంస్కరణలేనా?

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top