భూటాన్‌లో అనిల్‌ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి | anil ambani and bhutan govt company agree to made projects | Sakshi
Sakshi News home page

భూటాన్‌లో అనిల్‌ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి

Oct 3 2024 2:46 PM | Updated on Oct 3 2024 3:17 PM

anil ambani and bhutan govt company agree to made projects

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్‌ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.

రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్‌ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: కార్పొరేట్‌ కంపెనీలు ప్రెషర్‌ కుక్కర్లు!

ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్‌ సంస్థలు వాటి షేర​్‌ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ పక్కన పెట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement