భారతదేశంలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపే E20 ఇంధన విధానం అమలులోకి వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొందరు వాహనదారులు మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో భారత్ నుంచి పూర్తిగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పొరుగు దేశం భూటాన్ మాత్రం E20 పెట్రోల్ను తీసుకోవడానికి నిరాకరించింది. సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత వరకు అదే సరఫరా చేయాలని భారత చమురు సంస్థలను కోరింది.
భూటాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి పాత ఇంధన నిల్వ వ్యవస్థ ఉండటమే. దేశంలోని చాలా ఫ్యూయల్ ట్యాంకులు భూగర్భంలో ఉండటంతో వాటిలోకి నీరు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ తేమను త్వరగా ఆకర్షించే స్వభావం కలిగి ఉండటంతో, నీరు కలిసితే ఇంధనం నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు, ట్యాంకులు, పైప్లైన్లలో తుప్పు పట్టే ప్రమాదం పెరిగి, దీర్ఘకాలంలో వాహనాల ఇంజిన్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భూటాన్ అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా.. భూటాన్ ఎక్కువ భాగం పర్వత ప్రాంతం కావడం, అక్కడ అధిక తేమ ఉండటం కూడా మరో సవాలుగా మారింది. కొండ ప్రాంతాల్లో వాహనాలకు పూర్తి శక్తితో పనిచేసే ఇంధనం అవసరం కావడంతో E20 ఇంధనం ఆశించిన స్థాయిలో పనితీరు ఇవ్వకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.


