ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ! | AI Powered Smartphones Chatbots Health Revolution Promise or Privacy Risk | Sakshi
Sakshi News home page

ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!

Mar 13 2026 1:35 PM | Updated on Mar 13 2026 2:37 PM

AI Powered Smartphones Chatbots Health Revolution Promise or Privacy Risk

ఇటీవలికాలం వరకు సందేశాలకు, సెర్చ్ ఇంజిన్లకు మాత్రమే పరిమితమైన మీ స్మార్ట్‌ ఫోన్.. ఏఐ పుణ్యామా అని విభిన్న పనులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏఐ మీ నాడిచూసి, గుండె వేగం నుంచి ఆసుపత్రి రిపోర్టుల వరకు అన్నింటినీ విశ్లేషించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్‌బాట్ కోపైలట్ ద్వారా తీసుకువచ్చిన కొత్త హెల్త్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెజాన్, ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ , ఆంత్రోపిక్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలుకుతోందా లేక ఆరోగ్య రికార్డుల గోప్యతకు నీళ్లు వదులుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఏమిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్త్ ఫీచర్‌?

మైక్రోసాఫ్ట్ తాజాగా ఆవిష్కరించిన ఈ టూల్‌ వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను నేరుగా చాట్‌బాట్‌తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. యాపిల్ వాచ్, ఫిట్‌బిట్, స్లీప్ ట్రాకర్ వంటి పరికరాల నుంచి సేకరించిన ఫిట్‌నెస్ డేటాను ఇది విశ్లేషిస్తుంది.
వివిధ ఆసుపత్రుల రికార్డులను కలిపి వినియోగదారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలపై నిమిషంలో పూర్తి సమచారాన్ని అందిస్తుంది.

‘నేను సరిగ్గా నిద్రపోవడం లేదు’ అని మీరు చాట్‌బాట్‌తో అంటే చాలు.. మీ పాత మెడికల్ రిపోర్టులను, స్లీప్ ట్రాకర్ డేటాను పరిశీలించి అది మీకు ఉన్న నిద్రలేమి లేదా డయాబెటిస్ వంటి ముప్పులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఉచితంగా అందుబాటులోకి రానున్న ఈ సేవలకు భవిష్యత్తులో సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.

ప్రయోజనాలు..

సాధారణంగా ఒక రోగి వివిధ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రికార్డులు వేర్వేరు డేటాబేస్‌ల్లో ఉంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్ రోగి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ కింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సెకన్లలోనే సంక్లిష్టమైన రికార్డులను విశ్లేషిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా సామాన్యులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక విశ్లేషణ సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

నష్టాలు లేవా?

టెక్ కంపెనీల చేతికి అత్యంత సున్నితమైన ఆరోగ్య డేటా వెళ్లడంపై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్య రికార్డులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ గ్రీన్ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో రోగి గోప్యతను కాపాడే ‘హిప్పా’ చట్టాలు సాంప్రదాయ ఆసుపత్రులకు వర్తిస్తాయి కానీ, ఈ టెక్ కంపెనీలకు వర్తించవు. దీనివల్ల కంపెనీలు రోగుల డేటాను ప్రకటనల కోసం లేదా తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకునే ప్రమాదం ఉంది. గర్భస్రావాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య రికార్డులను కొన్ని సంస్థలు టెక్ కంపెనీల నుంచి సులభంగా పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయమా?

మైక్రోసాఫ్ట్ స్వయంగా ఒక గమనికను(Disclaimer) తెలియజేసింది. ఈ చాట్‌బాట్ కేవలం సమాచార విశ్లేషణకు మాత్రమేనని, ఇది వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేసింది. వ్యాధులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని సూచించింది. అయితే ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనవసరమైన ఆందోళన చెంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement