వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు | Agri exports likely to double to 100 billion by 2030 | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు

Jan 12 2024 4:35 AM | Updated on Jan 12 2024 4:36 AM

Agri exports likely to double to 100 billion by 2030 - Sakshi

గ్రేటర్‌ నోయిడా: భారత్‌ వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బరŠాత్వల్‌ తెలిపారు.

2030 నాటికి దేశం 2 ట్రిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు  సేవల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని దక్షిణాసియాలో అతిపెద్ద ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ప్రదర్శన– ఇండస్‌ఫుడ్‌ షో 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రెడీ–టూ–ఈట్‌ ఫుడ్‌ సెగ్మెంట్‌ వంటి రంగాలు వృద్ధి చెందడానికి భారీ అవకాశాలు ఉన్నాయి.  దిగుమతి చేసుకునే దేశాల ప్రమాణాలు,  అవసరాలపై పరిశ్రమ దృష్టి పెట్టాలి.  

2023–24లో  53 బిలియన్‌ డాలర్లపైనే...
కార్యక్రమాన్ని ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ మాట్లాడుతూ, 2022–23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతుల విలువ 53 బిలియన్‌ డాలర్లయితే, 2023–24లో ఈ పరిమాణం దాటుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బియ్యం, గోధు మలు, చక్కెరసహా కొన్ని కీలక కమోడిటీల ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఎగుమతుల విలువ పురోగతికి ఆటంకం ఉండబోదన్నారు.

ఈ ఉత్పత్తులపై ఎగుమతుల నిషేధం, ఆంక్షల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు  4–5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో గోయల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వం గోధుమలు, బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది.  చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. అయితే బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది.  భారత్‌ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. 

రైతుల కు మంచి విలువను అందించడానికి, ఉపాధిని సృష్టించడానికి,  దేశ ఆదాయాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్, ఉత్పత్తుల బ్రాండింగ్, ఎగుమతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గోయల్‌ ఫుడ్‌ షో ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. 158 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌లు మంజూరయిన ట్లు వెల్లడించారు. వన్‌ డి్రస్టిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌  (వోడీఓపీ) విధానం కింద 708 ఆహార పదార్థాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. 

ఫ్రోజెన్,  ప్యాక్‌ చేసిన, రెడీటూ ఈట్‌ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ ఎగుమతుల రంగంలో  నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, విజ్ఞాన మారి్పడికి సంబంధించి విశ్వవిద్యాలయాల ఒప్పందాలు, స్టార్టప్‌ల ప్రోత్సహం వంటి చర్యలు ఉండా లని సూచించారు.  నాణ్యత, పోషకాహారం, సేంద్రీయ పదార్థాలు, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ఆహార పోషణ– స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ప్రాముఖ్యతను విస్తరించాలని మంత్రి సూచించారు.  

90 దేశాల నుంచి ప్రతినిధులు...
ఆహారం, పానీయాల అంతర్జాతీయ ప్రదర్శనలో  ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల నుండి 1,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 7,500 మందికి పైగా కొనుగోలుదారులు పాల్గొన్నారు. చోయిత్రమ్స్, క్యారీఫోర్, ఖిమ్జీ రాందాస్, గ్రాండ్‌ హైపర్‌మార్కెట్, నెస్టో, ముస్తఫా, ఎక్స్‌5, లులు, అల్మయా గ్రూప్,  స్పార్‌ వంటి 80కి పైగా రిటైల్‌ చెయిన్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు  ట్రేడ్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మోహిత్‌ సింగ్లా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement