వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే.. | Adani Plan For Debt ReFinancing With Investors | Sakshi
Sakshi News home page

వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే..

Dec 15 2023 11:07 AM | Updated on Dec 15 2023 11:19 AM

Adani Plan For Debt ReFinancing With Investors - Sakshi

అదానీ గ్రూప్ ఎక్కువగా రుణాలను కలిగి ఉందని.. వాస్తవ విలువ కంటే అధిక లెవరేజ్ పొందిందంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. దాంతోపాటు హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో షేర్‌ విలువ బాగా తగ్గిపోయింది. అయితే ఆ సమయంలో చాలా రుణాలను కంపెనీ గడువు కంటే ముందే చెల్లించి తన పొటెన్షియల్‌ను నిరూపించుకుంది.

వచ్చే ఏడాది రూ.15వేల కోట్లు విదేశీ కరెన్సీ బాండ్‌లు మెచ్యూర్ అవుతుండటంతో.. అదానీ గ్రూప్ నగదు చెల్లింపులు, కొత్త బాండ్ విక్రయాల ద్వారా డెట్‌ రీఫైనాన్సింగ్‌ పూర్తి చేయాలని చూస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. 2019లో విక్రయించిన అదానీ గ్రీన్ హోల్డింగ్ కంపెనీ బాండ్లలో రూ.6200 కోట్లు తిరిగి చెల్లించడానికి, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ అయ్యే నగదు, అందుకు సమానమైన లిక్విడిటీ పూల్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

జులై నాటికి అదానీ పోర్ట్స్‌కి చెందిన రూ.5400 కోట్ల రుణాలను నగదు రూపంలో చెల్లించటానికి సైతం అదానీ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది రూ.2700 కోట్లు నగదును చెల్లించింది. మే నెలలో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్‌కు చెందిన  రూ.4100 కోట్ల బాండ్ రీఫైనాన్స్ కోసం రూ.3400 కోట్లు సమీకరించడానికి రుణదాతలతో అదానీ గ్రూప్ చర్చలు ప్రారంభించింది. అయితే 20 ఏళ్ల కాలానికి దీర్ఘకాలిక నిధులను సమీకరించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు గ్రూప్‌ వర్గాలు తెలిపాయి.

బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం మొత్తం అదానీ గ్రూప్ సంస్థలు సుమారు రూ.62వేల కోట్లు రుణాలను కలిగి ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీలతో పోలిస్తే, నగదు ప్రవాహాన్ని సృష్టించే ఆపరేటింగ్ కంపెనీల్లో రీఫైనాన్సింగ్ సులభం అవుతుందని సమాచారం. దాంతో అదానీ గ్రూప్ రీపేమెంట్ వ్యూహంలో భాగంగా దీన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు, నాన్-క్యుములేటివ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అదనంగా రూ.250 కోట్లు సమీకరించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించింది.

ఇదీ చదవండి: ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా?

కంపెనీ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌తో సహా భారతదేశం అంతటా 13 పోర్ట్‌లు, టెర్మినల్‌లను నిర్వహిస్తోంది. అలాగే అదానీ పోర్ట్స్ శ్రీలంకలోని ఒక కంటైనర్ టెర్మినల్ కోసం ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.4600 కోట్ల రుణాన్ని పొందింది.

Advertisement
 
Advertisement
Advertisement