ఖమ్మంవ్యవసాయం: విత్తనోత్పత్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలకపాత్ర పోషించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విభాగం డైరెక్టర్ డాక్టర్ నాగేష్కుమార్ సూచించారు. ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో గురువారం నాబార్డ్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల స్థాయి సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, విత్తన ఉత్పత్తిదారులు, రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నాగేష్ విత్తనోత్పత్తి ప్రాజెక్టు విధానాలు, మార్గదర్శకాలు, లక్ష్యాలను వివరించారు. పీఏసీఎస్లు విత్తన ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తే రైతులకు నాణ్యమైన విత్తనాలు అంది పంటల ఉత్పాదకత, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, విత్తన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం ప్రొఫెసర్ డాక్టర్ విద్యాధర్, విత్తన ధ్రువీకరణ అధికారి వేణు, డీసీఓలు గంగాధర్, శ్రీనివాసరావు, శ్రీరామ్, నాబార్డ్ డీడీఎం సుజిత్కుమార్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, వైరా కేవీకేల సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ టి.భరత్, డాక్టర్ పావని, డాక్టర్ రాములమ్మ, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్
నాగేష్కుమార్


