భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై తాజాగా చేపట్టిన తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయి. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ ఆధ్వర్యంలో 12 రెస్టారెంట్లను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని ఏడు రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా లేని 20 కిలోల మాంసం, 15 కిలోల గ్రేవీ, మూడు కిలోల మసాలా పేస్ట్.. మొత్తం 38 కిలోల ఆహార పదార్థాలను అధికారులు తొలగించారు. లోపాలను సరి దిద్దుకునేందుకు ఆయా రెస్టారెంట్లకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, వంట ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. కాగా, భక్తులు, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే భద్రాచలంలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలోనూ తరచూ తనిఖీలు చేయాలని పలువురు కోరుతున్నారు. తాజా ఆహారం అందేలా చర్యలు తీసుకువాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


