అశ్వారావుపేటరూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధారాలు సమర్పించని ఓటర్లకు నోటీసులు అందిస్తారని, ఈ నోటీసులతో ఓటు పునరుద్ధరణ చేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లు, మండల రాజకీయ పార్టీల బాధ్యులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటీసు ఇస్తే ఓటు తొలగించినట్లు కాదనే విషయాన్ని గమనించాలన్నారు. అనంతరం మండలంలోని దురదపాడు(దిబ్బగూడెం) గ్రామంలో పర్యటించి, గిరిజన రైతులకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సమస్యపై బాధిత రైతులతో మాట్లాడారు. తహసీల్దార్లు కిశోర్, బిందు, స్వాతి, స్వర్ణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఎన్నికల డీటీ హుస్సేన్, ఆర్ఐ తాటి కృష్ణ, పద్మావతి పాల్గొన్నారు.


