● మొదటి దశలో బూర్గంపాడు, నాగినేనిప్రోల వద్ద నిర్మాణం ● రూ.33.72 కోట్లతో 280 ఎకరాల భూసేకరణకు అనుమతి
బూర్గంపాడు: గోదావరి వరదలతో ఏటా తీవ్రంగా నష్టపోతున్న బూర్గంపాడు మండలానికి వరద ముప్పు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కిన్నెరసాని వైపు నుంచి కూడా నీళ్లు రాకుండా ఫేస్–1లో సంజీవరెడ్డిపాలెం నుంచి బూర్గంపాడు మీదుగా నాగినేనిప్రోలు వరకు గోదావరికి కరకట్ట నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం సుమారు 280 ఎకరాల భూసేకరణ చేయాలని ఇరిగేషన్ అధికారులు నివేదించగా, రూ.33.72 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వచ్చే ఏడాది గోదావరి వరదల నాటికి పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ ప్రక్రియ వారం రోజుల్లో ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫేస్–2లో..
గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే సారపాక, మోతె పట్టీనగర్, ఇరవెండి, దుమ్ముగూడెం మండలంలోని కొన్ని గ్రామాలకు ఫేస్–2లో కరకట్టలు నిర్మించనుంది. అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఫేస్–3లో కరకట్టలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. భద్రాచలం పట్టణానికి చుట్టూ కరకట్ట ఉండటంతో ఈ ఏడాది గోదావరి వరద ఎదురుగా ఉన్న బూర్గంపాడు మండలంపై పడింది. బూర్గంపాడు, నాగినేనిప్రోలు, సారపాకలపై ప్రభావం పెరిగింది. గతంలో 60 అడుగుల వరద వచ్చినప్పుడు ఏ మేరకు ముంపునకు గురైందో.. మూడురోజుల క్రితం వచ్చిన 56 అడుగుల వరదతో అదేస్థాయిలో ముంపునకు గురైందని స్థానికులు, రైతులు చెబుతున్నారు. భద్రాచలం వైపు గోదావరికి కరకట్ట పొడవు పెంచటంతో బూర్గంపాడు వైపు పంటలు ఎక్కువగా నీట మునిగాయని ఆవేదన చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.


