అలసత్వం చేయొద్దు
సమన్వయంతో విజయవంతం చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
‘నవమి’ పనుల్లో
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్ల పనుల్లో అలసత్వం వహించొద్దని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖలకు కేటాయించిన పనులను షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాన్య భక్తులు, వీఐపీలు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. టికెట్లను వీలైనంత త్వరగా ఆన్లైన్లో ఉంచాలని ఆలయ ఈఓకు సూచించారు. బారికేడ్ల పనులు సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. స్టేడియంలో శాశ్వత ప్రాతిపదికన కుళాయిలు ఏర్పాటు చేయాలని దేవస్థానం డీఈకి సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రతతో పాటు ట్రాఫిక్ జాం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. హోటళ్లు, లడ్డూ ప్రసాదాన్ని తనిఖీ చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. పర్ణశాలలో సైతం భద్రాచలం తరహాలో ఏర్పాట్లు చేసి, ఆ క్షేత్ర ప్రాముఖ్యతను మరింతగా పెంచాలన్నారు. ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల వారు విధులు నిర్వర్తించాలన్నారు. శ్రీరామ కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు వచ్చే భక్తులు గిరిజన మ్యూజియాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సుమారు రెండువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మ, డీఆర్డీఓ విద్యాచందన, ఆలయ ఈఓ దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ విజయాలు గర్వకారణం
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు సాధించిన విజయాలు గర్వకారణమని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు పలు పోటీల్లో 54 పతకాలు సాధించారన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విజేతలను అభినందించారు. క్రీడాకారులు సాధించిన 15 బంగారు, 19 వెండి, 20 కాంస్య పతకాలు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలోనే 31 పతకాలు సాధించడం సానుకూల పరిణామమని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు ప్రతిభ చూపడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కూడా జిల్లా క్రీడాకారులు రాణించేలా అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేశ్తోపాటు అనురాధ, మహీధర్, కొమరారం వెంకటనారాయణ, మట్టపర్తి రమేశ్, రమేశ్, వెంకటరామిరెడ్డి, నాగలక్ష్మి, చైతన్య, వాసు, నాగేందర్, నాగరాజు, మల్లికార్జున్, గిరిప్రసాద్, కావేటి రమేశ్, రఘు తదితరులు పాల్గొన్నారు.


