పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
సుజాతనగర్ : గ్రామాల్లో పచ్చదనం – పారిశుద్ధ్య చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. 2023 – 24లో జాతీయ అవార్డు సాధించిన సీతంపేట బంజర గ్రామాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. డ్రెయినేజీలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయ సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బహిరంగ మల విసర్జనకు స్వస్తి చెప్పాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, చెత్త వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శభ్రం చేస్తుండాలని సూచించారు. పచ్చదనం విస్తరణకు విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామ లైబ్రరీలో 8, 9,10 తరగతుల విద్యార్థులకు అవసరమైన అధ్యయన సామగ్రి అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారులపై గుంతలను సరిచేయడానికి అవసరమైన రోలర్ను అందజేస్తామని హామీ ఇచ్చారు. బయోచార్ తయారీతో వచ్చే బొగ్గును చల్లితే డ్రెయినేజీలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. త్వరలో జాతీయ స్థాయి పరిశీలన బృందం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణ, మౌలిక సదుపాయాల సంరక్షణలో లోపాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, ట్రెయినీ డీపీఓ అనూష, ఎంపీడీఓ బి.భారతి, డీఎల్పీఓ ప్రభాకర్, ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్ గుగులోత్ జానకీరాం, ఉప సర్పంచ్ బానోత్ సాలి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్


