బయోచార్తో భూసార పరిరక్షణ
టేకులపల్లి: భూసార పరిరక్షణకు బయోచార్ ఎంతో మేలు చేస్తుందని, పంటల ఎదుగుదల, దిగుబడి పెరుగుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మండలంలోని తంగెళ్లతండా సమీపంలో బయోచార్ తయారీ విధానంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయోచార్ బొగ్గులో ఆవుపేడ, ఆవు మూత్రం కలిపి ఎరువుగా వేస్తే భూసారం పెరుగుతుందని తెలిపారు. రైతులు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకోవాలని, సాగుతో పాటు అదనంగా మూడు, నాలుగు రకాల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. కౌజు పిట్టల పెంపకం, మునగ తోటలు, చేప పిల్లలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంతో పాటు కూరగాయల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎంపీడీఓ మల్లేశ్వరి, తహసీల్దార్ లంకా వీరభద్రం, సర్పంచ్లు ఊకే సునీత, బానోతు పూర్ణ, ఎంపీఓ గాంధీ, ఏఓ అన్నపూర్ణ, డీఆర్డీఏ కన్సల్టెంట్ రాజు, ఏపీఓ కాళంగి శ్రీనివాస్, ఏపీఎం హేమరత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


