
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృత అభిషేకం
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. తొలుత అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించిన అర్చకులు మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం చేయడంతో పాటు పంచ హారతులు సమర్పించారు. ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.
సాఫీగా యూరియా
సరఫరా
ములకలపల్లి: రైతులు ఇబ్బంది పడకుండా యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) బాబూరావు సూచించారు. ములకలపల్లి పీఏసీఎస్ను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన గోదాంలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు యూరియా అమ్మకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఆత్మ డీపీఓ సరిత, ఏఓ అరుణ్బాబు, ఏఈఓ సుజాత, సీఈఓ కుంచారపు శ్రీనివాసరావు, గోదాం ఇన్చార్జ్ బొమ్మకంటి కామేశ్ పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా మంగపతిరావు
ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా కూరపాటి మంగపతిరావు నియమితులయ్యారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను కోఆర్డినేటర్గా నియమిస్తూ ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కోఆర్డినేటర్గా ఉన్న మద్దినేని పాపారావు ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట హైస్కూల్ ఎస్ఏగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా, మంగపతిరావు శనివారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

స్వర్ణకవచధారణలో రామయ్య

స్వర్ణకవచధారణలో రామయ్య