
● వివాహితను మూడేళ్లుగా చిత్రహింసలు పెట్టినట్లు నిందితు
హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
అశ్వారావుపేట రూరల్: మూడేళ్లుగా తన భార్యకు భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు ఆమె భర్త, అతడి సోదరి, తల్లి ఒప్పుకున్నారని, వారిని అరెస్ట్ చేశామని సీఐ పింగిళి నాగరాజురెడ్డి వెల్లడించారు. సంచలనం కలిగించిన వివాహిత మృతిని హత్యగా తేల్చిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వానాథపురం గ్రామానికి చెందిన పూల లక్ష్మీప్రసన్న (33), భర్తతో కలిసి మూడేళ్లుగా అశ్వారావుపేటలోని కోనేరుబజార్లో భర్త అక్క ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఇంట్లో పనిచేస్తున్న క్రమంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఈ నెల 24వ తేదీన లక్ష్మీప్రసన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయగా లక్ష్మీప్రసన్న భర్త పూల నరేశ్బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ దాసరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. కాగా, తామే లక్ష్మీప్రసన్నకు మూడేళ్లుగా సరైన భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి, కొట్టి హత్య చేశామని నిందితులు విచారణలో వెల్లడించారని సీఐ తెలిపారు. నరేశ్బాబు, విజయలక్ష్మి, భూలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, దాసరి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. సమావేశంలో ఎస్ఐలు టి.యయాతిరాజు, రామ్మూర్తి, ట్రెయినీ ఎస్ఐ అఖిల, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఫోర్జరీ కేసు కొట్టివేత
భద్రాచలంఅర్బన్: ఫోర్జరీ కేసును భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. పట్టణానికి చెందిన పిలక లక్ష్మీమదన్రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న క్రమంలో తన సంతకాన్ని కొత్త రామస్వామి ఫోర్జరీ చేసి తన ఉద్యోగం పోయేలా చేశాడని ఆరోపిస్తూ 2007లో క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. సరైన సాక్షాలు లేకపోవడంతో కొత్త రామస్వామిపై నమోదైన కేసును న్యాయమూర్తి మంగళవారం కొట్టేవేశారు. రామస్వామి తరఫున న్యాయవాది ముత్యాల కిశోర్ వాదించారు.