ఏ మలుపు తిరుగునో? | - | Sakshi
Sakshi News home page

ఏ మలుపు తిరుగునో?

Aug 24 2025 7:39 AM | Updated on Aug 24 2025 7:39 AM

ఏ మలు

ఏ మలుపు తిరుగునో?

భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికై న తెల్లం వెంకట్రావు

గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ గూటికి..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై

వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

ఎట్టకేలకు మొదలైన నోటీసుల పర్వం

లేఖ అందలేదు

‘కారు’ దిగి కాంగ్రెస్‌లోకి..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజకీయ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ మొదలైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా పేరున్న వెంకట్రావు 2014 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు.

జిల్లా నుంచి ఒకే ఒక్కడు..

తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో ఎన్నికలు జరగగా అంతకు కొన్ని నెలల ముందే (ఆగస్టులో) తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ వెంటనే గులాబీ పార్టీ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేశారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్‌, కొత్తగూడెంలో ఆ పార్టీ బలపర్చిన సీపీఐ అభ్యర్థి గెలవగా.. అప్పటివరకు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానంగా ఉన్న భద్రాచలం మాత్రం బీఆర్‌ఎస్‌ ఖాతాలో పడింది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై తెల్లం వెంకట్రావు విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆఖరి నిమిషంలో పార్టీ మారి ఫాయిదా దక్కించుకున్న రాజకీయ చాణక్యుడిగా పిలిపించుకున్నారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసిన ఆరు నెలల్లోపే బీఆర్‌ఎస్‌ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ క్యాంప్‌లో చేరిపోయారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ముందుగా అసెంబ్లీ స్పీకర్‌ను, ఆ తర్వాత హైకోర్టును బీఆర్‌ఎస్‌ ఆశ్రయించింది. అనేక మలుపుల తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణకు రావాల్సిందిగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

ఇంకా స్పీకర్‌ పంపిన లేఖ అందలేదు. లేఖ వచ్చిన తర్వాత అందులో ఉన్న విషయం ఆధారంగా కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ పెద్దలతో సంప్రదించి స్పందిస్తా. అప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తా.

– తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెబుతూ వచ్చారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారని అంతా అనుకుంటుండగా 2024 ఏప్రిల్‌ 7న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాల్సి వచ్చిందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు.

ఏ మలుపు తిరుగునో?1
1/1

ఏ మలుపు తిరుగునో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement