
సీలింగ్ భూములకు పట్టాలు..
● సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● దామరచర్లలో సీఎం సభాస్థలి పరిశీలన, ఏర్పాట్లపై సమీక్ష
టేకులపల్లి/ఇల్లెందురూరల్/ఇల్లెందు/చండ్రుగొండ: నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సీలింగ్ భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇల్లెందు, టేకులపల్లి, చండ్రుగొండ మండలాల్లో పర్యటించారు. ఈ నెల 21న చండ్రుగొండ మండలం బెండాలపాడులో రాష్ట్రంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటించి చండ్రుగొండలోని హెలీప్యాడ్, దామరచర్లలోని సీఎం బహిరంగ సభాస్థలిని పరిశీలించారు. సీఎం కాన్వాయ్, ఇతర ప్రముఖుల వాహనాల పార్కింగ్, రూట్మ్యాప్, భద్రత ఏర్పాట్లపై ఎస్పీ రోహిత్రాజుతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. లక్ష మంది ప్రజలతో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బెండాలపాడు పాఠశాల ఆవరణలో సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజుతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎలాంటి లోపాలు ఉండొద్దని అధికారులకు సూచించారు. ఇల్లెందు మండలం మేడికుంట శివారులో మసివాగుపై రూ.6 కోట్లతో చేపట్టే బ్రిడ్జి నిర్మాణ పనులకు, సుభాష్నగర్ గ్రామపంచాయతీ లలితాపురం గ్రామం వద్ద రూ.3.60 కోట్లతో చేపట్టే రహదారి వెడల్పు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జేకు సింగరేణి సీఈఆర్ క్లబ్ గ్రౌండ్లో నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియం అభివృద్ధి పనులకు రూ. 1.50 కోట్లతో శంకుస్థాపన చేయగా, ప్రహరీ నిర్మాణం, గ్రౌండ్ చదును వంటి పనులు చేపట్టనున్నారు.
టేకులపల్లిలో రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు
టేకులపల్లి మండలంలో సుమారు రూ. 12 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోక్యాతండా నుంచి పాత తడికలపూడి వరకు రూ. 1.25 కోట్లతో, తావుర్యాతండా నుంచి కోక్యాతండా వరకు రూ.1.45 కోట్లతో బీటీ రహదారులు, లక్ష్మీపురం నుంచి పాత తడికలపూడి మధ్య రూ. 83 లక్షలతో కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన నిర్వహించారు. రాంపురంలో రూ.2.5 కోట్లతో, పెట్రాంచెలక ేవద్ద రూ. 2 కోట్లతో వంతెన, కిష్టారంలో రూ. 3 కోట్లతో చేపట్టనున్న హైలెవల్ వంతెనలకు శంకుస్థాపన చేశారు. సులానగర్ నుంచి ముత్యాలంపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. పాతతండాలో మొక్క నాటారు. కిష్టారంలో ఓ బాధితురాలి వైద్యం కోసం ఆర్థిక సాయం అందించారు. కోయగూడెంలోని ఎమ్మెల్యే నివాసంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మామిడిగుండాల ప్రాంతంలో సీలింగ్ భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరు చేస్తామని అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇల్లెందులో మంత్రి పర్యటన జోరువానలోనే సాగింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, నీటిపారుదల సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, అధికారులు రవికుమార్, ధన్సింగ్, శ్రీనివాస్ రావు, రాంప్రసాద్, శ్రీకాంత్, పీసీసీ కార్యదర్శి నాగా సీతారాములు, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు ముక్తి కృష్ణ, పులి సైదులు, మండల రాము, మహేష్, కోరం సురేందర్, దేవా, రెడ్యానాయక్, రాంబాబు, లక్కినేని సురేందర్, దళ్సింగ్, ధర్మయ్య పాల్గొన్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, సీఐలు బత్తుల సత్యనారాయణ, రవీందర్ బందోబస్తు నిర్వహించారు.

సీలింగ్ భూములకు పట్టాలు..