
అథారిటీతోనే అభివృద్ధి
● ఆశించినస్థాయిలో పురోగతి లేని భద్రాచలం ● శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తులకు నిత్యం తిప్పలే ● మౌలిక సదుపాయాల కొరతతో స్థానికులకూ తప్పని పాట్లు
భద్రాచలం అభివృద్ధిలో నానాటికీ వెనుకబడిపోతోంది. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థతో వర్షాకాలంలో అందరం ఇబ్బంది పడుతున్నాం. పట్టణాన్ని ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి.
–కందుల రాము, స్థానికుడు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో భద్రాచలంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, పట్టణం కలిపి లేదా విడివిడిగా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. భద్రాచలం పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటీష్, నైజాంల కాలంలో నదీ రవాణాకు అనుకూలంగా ఉండడం, రామయ్య కొలువై ఉండడంతో క్రమంగా పట్టణం విస్తరించగా.. జనాభా ప్రస్తుతం లక్ష వరకు చేరింది. అయితే అభివృద్ధిలో మాత్రం జీరోగానే ఉంది. మేజర్ గ్రామపంచాయతీగా వార్షికాదాయం ఎక్కువగానే ఉంది. అయినా వర్షాకాలంలో చినుకుపడితే రోడ్లన్నీ జలమయంగా మారుతాయి. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ, భవన, రోడ్ల నిర్మాణానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇష్టానురీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణాభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో భద్రాచలం విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రభుత్వ స్థలాలకు కొరత ఏర్పడింది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే చోట సమీకృత భవనం నిర్మించాలని, తద్వారా ఖాళీ స్థలాలను భక్తుల వసతి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు.
సత్వర అభివృద్ధి కావాలంటే..
భద్రాచలం దేవస్థానం అభివృద్ధి సైతం ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. అది మాఢ వీధుల విస్తరణ వద్దే ఆగిపోయింది. కొద్ది నెలల క్రితం బడ్జెట్లో యాద్రాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి రూ.100 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. కానీ భద్రాచలానికి డెవలప్మెంట్ అఽథారిటీ ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర అభివృద్ధికి స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారి టీ ఏర్పాటు చేసిన తరహాలో భద్రాచల పట్టణం, దేవస్థాన అభివృద్ధికి టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అథారిటీ ఏర్పాటు పర్యాటకా భిృద్ధికి కూడా దోహదం చేస్తుందని చెబుతున్నారు. తగిన సదుపాయాలు కల్పిస్తే ఏజెన్సీలో జలపాతాలు, పాపికొండలకు సందర్శకుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

అథారిటీతోనే అభివృద్ధి