
బాలికలదే పైచేయి..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం ఉత్తీర్ణత
● ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం.. ● ప్రతిభ చాటిన ప్రైవేటు కళాశాలలు, కేజీబీవీలు ● రాష్ట్రంలో జిల్లాకు 9వ స్థానం
కొత్తగూడెంఅర్బన్ : ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కాగా, బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అమ్మాయిలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్లో 3,028 మంది బాలురకు 1,570 మంది, 4,187 మంది బాలికలకు 2,944 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 860 మంది బాలురకు 402 మంది, 1,179 మంది బాలికలకు 863 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్లో2,996 మంది బాలురకు 1,855 మంది, 4,083 మంది బాలికలకు 3,190 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో బాలురు 763 మందికి 495 మంది, బాలికలు 1,024 మందికి 882 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 54.83, ద్వితీయ సంవత్సరంలో 70.72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది కొంతమేర పెరిగి రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. మే 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో..
కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 421 మందికి 181 మంది, ద్వితీయ సంవత్సరంలో 376 మందికి 238 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ విభాగంలో బి. శ్వేతశ్రీ 1000కి 936 మార్కులు సాధించింది. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో మేఘన 470కి 423 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కత్తి రమేష్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
కలెక్టర్ను కలిసిన డీఐఈఓ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వివరాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్కు డీఐఈఓ సీహెచ్ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందొద్దని, ఇలాంటి ఫెయిల్యూర్సే జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయని, తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు. త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

బాలికలదే పైచేయి..