● పడవల్లో తీసుకొచ్చిన 121 కిలోలగంజాయి పట్టివేత ● వివరాలు వెల్లడించిన పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్
బూర్గంపాడు: భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద నిరంతరం పోలీసులు నిఘా పెట్టడంతో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పడవలపై గోదావరిని దాటిస్తూ దూరప్రాంతాలకు గంజాయి రవాణా చేయటం మొదలెట్టారు. బూర్గంపాడుకు సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో తరలిస్తున్న 121 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ శనివారం వివరాలు వెల్లడించారు. శనివారం బూర్గంపాడు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కుక్కునూరు వైపు నుంచి వస్తున్న ఓ కారు పోలీసులను చూడగానే వెనుక్కి తిప్పే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఎస్ఐ రాజేశ్ కారును పట్టుకున్నారు. అందులో రూ.60.57 లక్షల విలువైన 121 కిలోల గంజాయి దొరికింది. కారును సీజ్ చేసి, కారులో ఉన్న సారపాక రాజీవ్నగర్కు చెందిన వాంకుడోత్ సాయికుమార్, కూనవరం మండలం పొలిపాక గ్రామానికి చెందిన పెడముత్యం వంశీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒడిశాలోని బలిమెలకు చెందిన భీమా వద్ద గంజాయి కొనుగోలు చేసి కారులో పొలిపాక తరలించారు. అక్కడి నుంచి నాటు పడవల్లో కుక్కునూరు మండలం వింజరం గ్రామానికి.. అక్కడి నుంచి కారులో తరలిస్తూ పట్టుబడ్డారని డీఎస్పీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో ఎస్కే మున్వర్, రమేశ్, కత్వాల సురేశ్, జగదీశ్, స్వరూప్, ఎల్లాజి, వాంకుడోత్ సురేశ్ భాగస్వాములుగా ఉన్నారని, వింజరం నుంచి కారులో గంజాయిని ఇల్లెందు క్రాస్రోడ్ వరకు తరలించి, అక్కడి నుంచి సోలాపూర్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వాంకుడోత్ సురేశ్కుమార్ ప్రస్తుతం సోలాపూర్లో ఉంటూ గంజాయిని విక్రయించేందుకు పథకం వేసుకున్నారని, ఎస్కే మున్వర్, రమేశ్, కత్వాల సురేశ్, జగదీశ్, వాంకుడోత్ సాయికుమార్ గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ సతీశ్కుమార్ పేర్కొన్నారు. పాల్వంచ సీఐ సతీశ్, ఎస్ఐలు రాజేశ్, ప్రవీణ్, రామారావు, ట్రెయినీ ఎస్ఐ కేవ్సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.